Home వార్తలుఖమ్మం త్రాగు, సాగునీటి, విద్యుత్ సరఫరా, రైతు భరోసా, రేషన్ కార్డు దరఖాస్తుల ధృవీకరణ, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సిఎస్

త్రాగు, సాగునీటి, విద్యుత్ సరఫరా, రైతు భరోసా, రేషన్ కార్డు దరఖాస్తుల ధృవీకరణ, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సిఎస్

by VRM Media
0 comments

డిమాండ్ కు అనుగుణంగా నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండాలి….. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

*ప్రతి బుధవారం పాఠశాల, హాస్టల్ లలో భోజనం నాణ్యత తనిఖీ, కిచెన్ గార్డెన్, వాటర్ ఫిల్టర్స్ ఏర్పాటును ప్రశంసించిన సీ.ఎస్.

*ప్రతి నీటి చుక్కను వినియోగించుకొని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి

*వేసవిలో త్రాగునీటి సరఫరా ఇబ్బందులు రాకుండా చర్యలు

*త్రాగు, సాగునీటి, విద్యుత్ సరఫరా, రైతు భరోసా, రేషన్ కార్డు దరఖాస్తుల ధృవీకరణ, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సిఎస్

ఖమ్మం, ఫిబ్రవరి -18:

ఖమ్మం జిల్లాలో అమలు చేస్తున్న ప్రతి బుధవారం ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్ లో భోజన నాణ్యత తనిఖీ, పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు, వాటర్ ఫిల్టర్ ల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రశంసించారు.

మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా త్రాగు, సాగునీటి, విద్యుత్ సరఫరా, రైతు భరోసా, రేషన్ కార్డు దరఖాస్తుల ధృవీకరణ, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు.

త్రాగునీటి సరఫరా, రబీ పంటలకు సాగు నీరు, డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరా, రేషన్ కార్డుల దరఖాస్తుల ధృవీకరణ, రైతు భరోసా పథకాల అమలు పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్చించి కలెక్టర్లకు పలు సూచనలు జారీ చేశారు.

విద్యుత్ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, గత సంవత్సరం మార్చి నెలలో వచ్చిన అత్యధిక విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం ఫిబ్రవరి మాసంలోనే వస్తుందని అన్నారు. పీక్ డిమాండ్ వచ్చినా సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని సీఎస్ తెలిపారు. వ్యవసాయం, గృహాలు, పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా కొనసాగాలని, అవసరమైన మేర విద్యుత్తు అందుబాటులో ఉన్నందున ఎక్కడా ఎటువంటి లోటు రావడానికి వీలు లేదని సిఎస్ అన్నారు.

సబ్ స్టేషన్ ల వారీగా అదనపు విద్యుత్ పంపిణీకి తట్టుకునేలా నూతన విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్ ల ఏర్పాటు పనులను ఫిబ్రవరి నెల వరకు పూర్తి చేయాలని సీఎస్ అన్నారు. విద్యుత్ సరఫరా అంశంలో స్థానికంగా ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని, డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలని సి.ఎస్. కలెక్టర్లకు సూచించారు. ఫీడర్ల వద్ద సమస్యతో గత సంవత్సరం కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని, ఈ సంవత్సరం ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని అన్నారు.

మిషన్ భగీరథ, పట్టణాలలో అమృత్ క్రింద చేపట్టిన త్రాగునీటి పథకం, ఇతర త్రాగునీటి పథకాలకు, ఆసుపత్రులకు, వ్యవసాయ ఫీడర్లకు నిరంతరాయ సరఫరా ఉండే విధంగా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని సబ్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ, అక్కడ పరిస్థితులను పరిశీలిస్తూ ఉండాలని సి.ఎస్. అన్నారు.

రైతు భరోసాపై మాట్లాడుతూ, వ్యవసాయ యోగ్యమైన భూమికి రైతు భరోసా పథకం అమలు చేయడం జరుగుతున్నదని, ప్రజాపాలన గ్రామ సభలలో కొన్ని సర్వే నెంబర్ లలో కొంత మేర సాగు భూమి వ్యవసాయేతర భూమిగా నమోదైందని తమ దృష్టికి తీసుకుని వచ్చారని, వాటిని సరిచేసే అవకాశం పోర్టల్ లో అందించామని అన్నారు.

రైతు భరోసాపై ఫిర్యాదులను పరిష్కరించేందుకు మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి పరిధిలో గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని, రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సిఎస్ పేర్కొన్నారు.

అవసరమైన ఎరువులు సంపూర్ణంగా అందుబాటులో ఉన్నాయని, జిల్లాలలో ప్రతి మండలంలో అవసరమైన ఎరువుల స్టాక్ ఉండే విధంగా కలెక్టర్ పర్యవేక్షించాలని అన్నారు. జిల్లాలలో ఎక్కడైనా అవసరం ఉంటే వెంటనే సంప్రదించాలని, స్టాక్ లేకపోతే వెంటనే స్టాక్ అందించేలా చూడాలని అన్నారు.

సాగునీటి సరఫరాపై సీఎస్ మాట్లాడుతూ, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం సాగునీరు రైతులకు అందాలని, ప్రతి నీటి చుక్కను వినియోగించుకోవాలని అన్నారు. ఎస్సారెస్పీ సాగునీరు అందే జిల్లాలలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి రాబోయే మూడు వారాల పాటు అప్రమత్తంగా ఉంటూ సాగునీటిని అందించి పంటలు కాపాడేందుకు కృషి చేయాలని అన్నారు.‌

వేసవి కాలంలో త్రాగునీటి సరఫరాపై సిఎస్ సమీక్షిస్తూ, మిషన్ భగీరథ ద్వారా రాబోయే వేసవి కాలంలో త్రాగునీటి ఇబ్బందులు ఎట్టి పరిస్థితుల్లో రావద్దని అన్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా కోసం సోర్స్ వద్ద అవసరమైన నీటి నిల్వలు ఉండేలా నీటిపారుదల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాలని అన్నారు. మిషన్ భగీరథ ఇబ్బందులు ఉన్న గ్రామాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అన్నారు. గతంలో ఉన్న నీటి సరఫరా పథకాలు, పంప్ సెట్ ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని, అవసరమైతే ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో నీటి సమస్యలు ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అన్నారు.

రేషన్ కార్డు వెరిఫికేషన్ పై సీఎస్ సమీక్షిస్తూ, ప్రజా పాలన అర్జీలు, గ్రామ సభలలో వచ్చిన దరఖాస్తులు, మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులు అన్నింటిని పరిశీలన చేయాలని అన్నారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలు మరొకసారి మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలని సిఎస్ తెలిపారు.

ప్రస్తుతం ఎన్నికల కోడ్ లేని జిల్లాలలో నూతన రేషన్ కార్డుల జారీ చేయాలని అన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన జిల్లాలలో కొత్త కార్డులను జారీ చేయాలని అన్నారు. రేషన్ కార్డుల స్క్రూటినీ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకారం అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందేలా చూడాలని సిఎస్ తెలిపారు.

జిల్లాలలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలల్లో, సంక్షేమ హాస్టల్స్, కస్తూర్బా గాంధీ విద్యాలయాలను నిరంతరం తనిఖీ చేస్తూ అక్కడ విద్యార్థులకు అవసరమైన వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలో తనిఖీలలో ఎదురయ్యే అనుభవాలపై నివేదిక అందించాలని సి.ఎస్. తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలో ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా త్రాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు. ఖమ్మం నగరంలో వరదల కారణంగా దెబ్బతిన్న పనులను సైతం పూర్తి చేసామని అన్నారు. ఖమ్మం జిల్లాకు త్రాగునీటి ఇబ్బందులు లేవని అన్నారు.

ఖమ్మం జిల్లాలో ప్రతి బుధవారం జిల్లా అధికారులచే ప్రభుత్వ పాఠశాలలను, గురుకులాలను తనిఖీ చేయడం ద్వారా ఆహార నాణ్యత మెరుగైందని అన్నారు. మధ్యాహ్న భోజనంలో పిల్లలకు అందించే బియ్యం, కూరగాయలు నాణ్యత రెగ్యులర్ గా మానిటర్ చేయడం ద్వారా విద్యార్థులకు మంచి భోజనం అందుతుందని అన్నారు.

50 పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసి కూరగాయలను పెంచుతున్నామని, ప్రతి తరగతి విద్యార్థులకు కొన్ని మొక్కల పెంపకం బాధ్యత అప్పగించడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. వాటర్ ఫిల్టర్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ఇ సురేందర్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Vrm media

2,819 Views

You may also like

Leave a Comment