Home వార్తలుఖమ్మం *స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

*స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

by VRM Media
0 comments

Vrm media

మనం ఆశించే మార్పు మన ఇంటి నుంచే ప్రారంభించాలి…… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

*విద్యతో జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు

మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకువెళ్ళాలి

*స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

ఖమ్మం, ఏప్రిల్ -05:

మనం ఆశించే మార్పు మన ఇంటి నుంచే ప్రారంభించాలనే సూక్తిని బాబు జగ్జీవన్ రామ్ పాటించారని, తన కుమార్తెను ఉన్నత విద్య చదివించారని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.

శనివారం స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు లతో కలిసి పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మహనీయుల జీవితాల నుంచి మనం స్ఫూర్తి పొందేందుకు జయంతి వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు. ప్రస్తుతం మనకు విద్య, ఇతర రంగాలలో అవకాశాలు లభిస్తున్నాయంటే దానికి గతంలో మన పూర్వీకులు చేసిన శ్రమ ఎంతో ఉందని అన్నారు.

80 సంవత్సరాల క్రితం మనకు విద్య అవసరం లేదు, పరిపాలన చేత కాదు వంటి కారణాలు చెబుతూ అనేక రకాలుగా విభజించేందుకు ప్రయత్నం చేశారని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వంటి అనేక మంది మహనీయులు, పెద్దలు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని, కుటుంబాల గురించి ఆలోచించకుండా దేశం బాగు కోసమే పని చేశారని అన్నారు. ఎటువంటి పరిస్థితులలో జన్మించినా విద్య ఉంటే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని మహనీయులు నిరూపించారని కలెక్టర్ తెలిపారు. పిల్లలకు త్రాగునీరు అందించడంలో వివక్షను గమనించి దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని, అన్యాయాన్ని ఎదురించాలని ఆయన మనకు బోధించారని అన్నారు.

విద్యతో మంచి ఉపాధిని సంపాదించి ఆర్థికంగా బలోపేతం అవుతూ సమాజంలో మరో నలుగురికి సహాయం చేస్తూ కూడా అన్యాయం ఎదిరించవచ్చని, శాంతి మార్గంలో కూడా వివక్షతను పారద్రోలవచ్చని మన దేశం నిరూపించిందని అన్నారు.

మనం ఆశిస్తున్న మార్పు మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని కలెక్టర్ సూచించారు. బయట చెప్పే సూక్తులను ఇంట్లో పాటిస్తూ ఆనాటి రోజులలో కూతురిని చదివించిన మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ అని కలెక్టర్ తెలిపారు. ఆడపిల్లలకు చదువు ఎందుకు అనే రోజులలో తన కుమార్తెను సివిల్ సర్వీస్ వరకు చదివించారని అన్నారు.

మహనీయులు సమాజంలో మార్పు కోసం పని చేశారని, వారిని ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేయవద్దని అన్నారు. భారత దేశం ఎదుర్కొన్న ఆహార సంక్షోభ సమయాల్లో హరిత విప్లవం తీసుకుని రావడంలో జగ్జీవన్ రామ్ కృషి ఉందని అన్నారు. నేడు పేదలకు ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తుందంటే గతంలో ఇటువంటి మహనీయులు చేసిన కృషి కారణమని కలెక్టర్ తెలిపారు.

సమాజంలో వేల సంవత్సరాల నుంచి అణిచివేతకు గురై వెనుకబడిన వర్గాలకు దేశ సంపదలో మొదటి హక్కు కల్పించి, వారిని ఇతర వర్గాలతో సమానంగా అభివృద్ధి చేసేందుకు వివిధ శాఖలు పని చేస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. దేశంలో ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు సమానంగా అందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు.

మనం వ్యక్తిగతంగా ఎదగడం ముఖ్యం కాదని, మనం ఎదిగే సమయంలో మరో నలుగురికి తోడ్పాటు అందించాలని, అప్పుడే జీవితానికి ఒక సార్ధకత ఏర్పడుతుందని కలెక్టర్ తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ బాటలో పోరాడిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని తెలిపారు. చిన్న గ్రామంలో జన్మించినా దేశంలో అనేక సంస్కరణలు తీసుకొని రావడంలో కృషి చేశారని అన్నారు. జవహార్ లాల్ నెహ్రూ క్యాబినెట్ లో అతి చిన్న వయస్సులో స్థానం సంపాదించుకున్నారని, 40 సంవత్సరాల పాటు అనేక మంత్రిత్వ శాఖలలో పని చేసి దేశ ఉప ప్రధాని స్థాయికి ఎదిగారని తెలిపారు.

వ్యవసాయ శాఖ మంత్రిగా పేదల ఆకలి తీర్చేందుకు హరిత విప్లవం తీసుకుని వచ్చారని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ కుమార్తె లోకసభ స్పీకర్ గా ఉన్న సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం జరిగిందని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వంటి మహనీయుల చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియజేయాలని జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు. భవిష్యత్తు తరాలకు మహనీయుల చరిత్ర, ఆశయాలు ఆలోచన విధానం తెలియజేయాలని అన్నారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఉప ప్రధానిగా చేశారని, 29 సంవత్సరాల చిన్న వయస్సులోనే శాసన మండలికి ఎంపికయ్యారని, 1937 లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారని తెలిపారు. 1946లో తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలలో పని చేశారని తెలిపారు.

సుదీర్ఘ కాలం పని చేసి పార్లమెంటరీ వ్యవస్థకు గౌరవం తీసుకువచ్చిన మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ అని తెలిపారు. చిన్నతనం నుంచి అంటరాని తనం వంటి వివక్షత, అవమానాలను ఎదుర్కోంటూ రాజ్యాంగ సంస్థల్లో కీలక పదవులు చేపట్టి అత్యున్నత స్థాయికి ఎదిగారని తెలిపారు.

అంటరానితనం గతంలో చాలా ఉండేదని, మంచి నీరు త్రాగేందుకు దళితులకు ప్రత్యేక కుండలు ఉండేవని, ఇటువంటి దుర్భర పరిస్థితుల నుంచి రాజ్యాంగం కల్పించిన హక్కులు, విద్య, సాంకేతికతల కారణంగా ప్రస్తుతం అందరం సమానంగా ఉన్నామని అన్నారు.

దళితుల పట్ల జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశారని అన్నారు. దళితులకు ఆలయాల్లో ప్రవేశాలు కల్పించాలని ఉద్యమాలు చేశారని, దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. కార్మిక శాఖ మంత్రిగా పని చేసే సమయంలో కనీస వేతనం చట్టం తీసుకొని వచ్చారని, ఆహార సంక్షోభ సమయంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకొని హరిత విప్లవం తీసుకుని వచ్చారని, రైల్వే శాఖ మంత్రిగా అత్యధిక కిలో మీటర్లు రైల్వే లైన్ అభివృద్ధి చేశారని అన్నారు.

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవ కమిటీ కన్వీనర్ జమళ్ళముడి దాస్ మహారాజ్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ బెనారస్ విశ్వ విద్యాలయంలో చదువుకున్నారని తెలిపారు. కార్మికులకు కార్మిక చట్టాలు రక్షణ కల్పిస్తున్నాయంటే దానికి కారణం బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మీ సేవా యూనిట్ల ఏర్పాటును వేగవంతంచేయాలని కోరారు. రాజీవ్ యువ వికాసం పథకం క్రింద వేలాది మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ లోనీ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ కస్తాల సత్యనారాయణ, ఈడి ఎస్సీ కార్పొరేషన్ నవీన్ బాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కళావతి బాయి, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవ కమిటీ అధ్యక్షులు కొర్లపాటి చిరంజీవి, గౌరవ అధ్యక్షులు ముడుసు జాకబ్ ప్రతాప్, ఇటికల లత, కో కన్వీనర్ లు, గౌరవ సలహాదారులు, కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Vrm media

2,825 Views

You may also like

Leave a Comment