Home kothagudem చిట్ట చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్యలు….. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు

చిట్ట చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్యలు….. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు

by VRM Media
0 comments

Vrm media prathinidhi

చిట్ట చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్యలు….. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు

*తక్కువ ఖర్చుతో అధిక ఆయకట్టు వచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యత

*మధిర మండలంలో ఎత్తిపోతల పథకాలు, చెక్ డ్యాం నిర్మాణం, రోడ్డు నిర్మాణ, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన డిప్యూటీ సి.ఎం.

ఖమ్మం/మధిర, ఏప్రిల్ -20:

చిట్ట చివరి ఆయకట్టుకు సాగునీరందేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

ఆదివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంచార్జ్ కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి మధిర మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు.

ఈ సందర్భంగా సిరిపురం గ్రామ శివారులో ఉప ముఖ్యమంత్రిని మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికి దారి వెంట పూల వర్షం కురిపిస్తూ మహిళలు తమ అభిమానాన్ని చాటుకున్నారు.

సిరిపురం గ్రామంలో 1240 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో 6 కోట్ల 85 లక్షలతో చేపట్టిన చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు, సిరిపురం గ్రామంలో ఐదు కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి, 10 కోట్ల 31 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన మధిర ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ భవన నిర్మాణ పనులకు ఉపముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

మహాదేవపురం గ్రామంలో సుమారు 952 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 12 కోట్ల 14 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన మహాదేవాపురం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి, రాయపట్నం గ్రామంలో 1079 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన రాయపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

మధిర మునిసిపాలిటీ 3వ వార్డు, అంబారుపేటలో మధిర నుండి ములుగుమాడు వయా నిదానపురం వరకు ఉన్న రహదారిని 25 కోట్ల అంచనా వ్యయంతో రెండు వరసల రహదారిగా అభివృద్ధి చేయుటకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు ఉపముఖ్యమంత్రి, శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ మధిర మండలం సిరిపురం గ్రామంలో 1240 ఎకరాలకు సాగునీరు అందించే దిశగా వైరా నదిపై 6 కోట్ల 85 లక్షలతో చెక్ డ్యాం నిర్మిస్తున్నామని, చెక్ డ్యామ్ నిర్మాణం వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయ వృద్ధికి దోహద పడతాయని, వేసవి, చలి కాలంలో భూగర్భ జలాల కొరత తగ్గిపోతుందని అన్నారు.

చెక్ డాం పైన 3 చిన్న ఎత్తిపోతల పథకాలు ఉన్నాయని, చెక్ డ్యాం నిర్మాణం వల్ల బ్యాక్ వాటర్ 1.5 కిలో మీటర్ల వరకు ఉంటుందని, చిన్న ఎత్తిపోతల పథకాలకు సంవత్సరం పాటు నీరు అందుబాటులో ఉంటుందని, నది గర్భం సమీపంలో గల గ్రామాలలో భూగర్భ జలాలు అధికంగా పెరుగుతాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి ఖర్చు చేసినప్పటికీ ఆయకట్టు సృష్టించడంలో వైఫల్యం చెందిందని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తక్కువ ఖర్చుతో కూడుకున్న పనులు చేపట్టి అధిక ఆయకట్టు సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు.

పేదల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం సమాంతరంగా చేపడుతుందని అన్నారు. గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విద్వంసాన్ని సరిచేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు.

మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా, 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్స్ చార్జిల పెంపు వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు.

కార్పోరేట్ కు దీటుగా మన పిల్లలు చదువుకోవాలని యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాలను నిర్మిస్తున్నామని అన్నారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని, మొదటి దశలో నిరుపేదలకు మంజూరు చేస్తామని అన్నారు.

రైతుల సంక్షేమం దిశగా రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా, సన్న బియ్యం పండించిన రైతులకు క్వింటాల్ వడ్లకు 500 రూపాయల బోనస్, రైతు బీమా, ఉచిత విద్యుత్ కు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశామని అన్నారు.

మహిళలను సంపన్నులుగా చేసే దిశగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద వివిధ పనులు చేపట్టామని, ఇందిరమ్మ క్యాంటీన్ లు ఏర్పాటు, మండలాలలో పెట్రోల్ బంకుల ఏర్పాటు, రైస్ మిల్లులో ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు.

ఈ సమావేశంలో ఇరిగేషన్ ఖమ్మం సిఇ ఓ.వి. రమేష్ బాబు, విద్యుత్ శాఖ ఎస్ఇ శ్రీనివాసా చారి, ఆర్ అండ్ బి ఎస్ఇ యుగంధర్, ఇర్రిగేషన్ కల్లూరు సర్కిల్ ఎస్ఇ జి.వాసంతి, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పీఆర్ ఇఇ వెంకట్ రెడ్డి, ఇర్రిగేషన్ మధిర డివిజన్ ఇఇ సి.హెచ్. రామకృష్ణ, మధిర డిఇఇ వి. నాగ బ్రహ్మయ్య, సిరిపురం ఏఇఇ బి.శివ సాగర్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Vrm media

2,822 Views

You may also like

Leave a Comment