

తప్పు చేస్తే విదేశాల్లో దాక్కున్నా లాక్కొస్తాం
జగన్ కు గంటా మాస్ వార్నింగ్
విశాఖపట్నం, మే 23: తప్పు చేశారని తేలితే విజయవాడలోనే కాదు.. విదేశాల్లో దాక్కున్నా లాక్కుని వస్తారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో జరిగిన జిల్లా మహానాడులో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి.. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వ్యక్తిగత కక్షసాధింపు రాజకీయాలను పెంచి పోషించారని విమర్శించారు. వైసీపీ హయంలో శుక్రవారం వస్తే విశాఖలో ఎవరి భూములకు మూడుతుందో అని భయపడేవారని చెప్పారు. ఎన్నికల్లో నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేసిన విజయసాయిరెడ్డిని సౌమ్యుడు.. మంచివాడు.. నిబద్ధత కలిగిన వాడని పొగిడిన జగన్మోహన్ రెడ్డి, ఏడాది తిరగకుండానే విజయసాయిరెడ్డి ప్రలోభాలకు అమ్ముడుపోయారని విమర్శించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. వైసీపీ మునిగిపోయిన పడవ అని.. ఒకప్పుడు ఆ పార్టీ ఉండేదని చరిత్ర పుస్తకాల్లో చదువుకోవాలని వ్యాఖ్యానించారు. విశాఖ టీడీపీ కంచుకోటని.. ప్రతీ ఎన్నికల్లోనూ జగన్మోహన్ రెడ్డికి పరాభవాన్ని రుచి చూపించిందని తెలిపారు. విశాఖ నాలుగు దిక్కుల్లో వైసీపీని కాలు మోపనివ్వలేదని.. ఎన్ని కుప్పిగంతులు వేసినా విశాఖలో జగన్మోహన్ రెడ్డికి అపజయం తప్పదని జోస్యం చెప్పారు.
పేదలకు సంక్షేమాన్ని పరిచయం చేసిన ఎన్టీఆర్
తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీని స్థాపించి.. 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ పేద ప్రజలకు సంక్షేమాన్ని పరిచయం చేసిన కారణజన్ముడని చెప్పారు. పార్టీని చంద్రబాబు నాయుడు సంస్థాగతంగా బలోపేతం చేసి అనేక పాలన సంస్కరణలను తీసుకువచ్చారని ప్రశంసించారు. మూడో తరంలో లోకేష్ కార్యకర్తలకు భరోసాగా నిలుస్తూ, ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీలోనూ లేని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారన్నారు. అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి, మాజీ ఎంపీ పెతకంశెట్టి అప్పలనరసింహం ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి అధ్యక్షత వహించిన సమావేశంలో ఎమ్మెల్యేలు పి.గణబాబు, వెలగపూడి రామకృష్ణ బాబు, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, సౌత్ ఇంచార్జ్ సీతంరాజు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Vrm media vizag srinivasarao