
పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా ఇందిరమ్మ ప్రభుత్వ పాలన… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి
Vrm media పెనుబల్లి ప్రతినిధి చెన్న కేశవ




ఖమ్మం, జూలై -17:
పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
మంత్రివర్యులు, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి గురువారం పెనుబల్లి మండలం, పాత కుప్పెనకుంట్ల గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ నూతన భవనానికి ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా కొనసాగిస్తుందని అన్నారు. గత పాలకులు అమలు చేసిన మంచి పథకాలను కొనసాగిస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు.
పేద ప్రజలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉగాది నుండి రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా, ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, మహిళలకు ఆర్టిసి బస్సులో ఉచిత బస్ ప్రయాణం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు.
దేశంలో మరెక్కడా లేని విధంగా ఉగాది నుండి తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. 22 వేల 500 కోట్లతో ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కల కోసం 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడతలో మంజూరు చేసిందని అన్నారు. ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఉంటుందని, నిరంతర ప్రక్రియగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కొనసాగుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఎవ్వరు అధైర్య పడవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామన్నారు.
ఇందిరమ్మ ప్రభుత్వం సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ అందించిందని మంత్రి తెలిపారు. రైతు భరోసా పథకం క్రింద పెట్టుబడి సహాయం ఎకరానికి 10 వేల నుంచి 12 వేల రూపాయలకు పెంచి, రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఎన్నో కార్యక్రమాలు అమలుచేసి, అర్హులకు అందజేస్తున్నామని, ఇంకనూ చేయాల్సివుందని, ప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా, విజ్ఞప్తి మేరకు మంత్రి, సత్తుపల్లి నియోజకవర్గానికి మరో 1500 ఇండ్లు అదనంగా ఇచ్చారన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి క్రింద 200 యూనిట్ల ఉచిత కరంట్, క్రొత్త రేషన్ కార్డుల జారీ, రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ, రైతు ఋణమా, రైతు భీమా, రైతు భరోసా, సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు, 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఎంతో పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందజేస్తున్నామన్నారు.