

VRM న్యూస్ బాలమౌళి ఒంటిమిట్ట ఆగస్టు 25
మండల ప్రజలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆధార్ సెంటర్ ఒంటిమిట్టలో ప్రారంభమైంది. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన ఈ కేంద్రాన్ని అధికారులు ప్రారంభించడంతో ప్రజల్లో హర్షం నెలకొంది. ఇప్పటివరకు ఆధార్ నమోదు, సవరణ కోసం కడప పట్టణం వరకు వెళ్లి తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అదే సేవలు మండల కేంద్రంలో అందుబాటులోకి రావడంతో ప్రజలకు సౌలభ్యం కలగనుంది.
ఈ ఆధార్ కేంద్రంలో పలు సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. కొత్త ఆధార్ నమోదు, పేరు, తల్లిదండ్రుల పేరు సవరణ, పుట్టినతేదీ సరిదిద్దుకోవడం, చిరునామా మార్పు, ఫోటో, వేలిముద్రలు, నేత్రపుటాల (బయోమెట్రిక్) అప్డేట్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ లింక్ చేయడం , ఆధార్–పాన్, ఆధార్–బ్యాంక్ ఖాతా లింక్ చేయడం, ఇ–ఆధార్ ప్రింట్ తదితర సదుపాయాలు కలవు
ప్రతి చిన్న పనికోసం బయటకు వెళ్లి గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సి వచ్చేది. కొత్త కేంద్రం ఏర్పాటు కావడంతో వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, రైతులకు తక్షణ సేవలు లభిస్తున్నాయి. “మన మండల కేంద్రంలోనే ఆధార్ పనులు జరిగిపోతున్నాయి” అంటూ మండలవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ప్రతి ఒక్కరూ ఆధార్ నమోదు చేసుకోవాలని, ఇప్పటికే ఉన్నవారు తమ వివరాలు సరిచూసుకుని అవసరమైన అప్డేట్లు చేసుకోవాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.