

‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ.. గత చిత్రం ‘జాక్’తో దారుణంగా నిరాశపరిచాడు. ఆ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.5 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి, డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ‘తెలుసు కదా’తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ‘జాక్’ వంటి డిజాస్టర్ తర్వాత వస్తున్నప్పటికీ.. ఈ చిత్రం రూ.20 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. (సిద్ధు జొన్నలగడ్డ)
నైజాంలో రూ.8 కోట్లు, సీడ్లో రూ.2.50 కోట్లు, ఆంధ్రాలో రూ.6 కోట్లతో.. ‘తెలుసు కదా’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.16.50 కోట్ల బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి మరో రూ.5.50 కోట్ల బిజినెస్ చేసిందని.. దీంతో వరల్డ్ వైడ్ గా మొత్తం రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. అంటే బ్రేక్ ఈవెన్ సాధించి, హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే.. రూ.22 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంటుంది. (తెలుసు కదా)
రేపు(అక్టోబర్ 16) థియేటర్లలో అడుగుపెడుతున్న ‘తెలుసు కదా’పై పెద్దగా బజ్ లేదు. ప్రచార చిత్రాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. పైగా, ‘జాక్’ వంటి డిజాస్టర్ తర్వాత సిద్ధు నటించిన చిత్రమిది. ఇన్ని ప్రతికూలతల నడుమ కూడా ‘తెలుసు కదా’ సినిమా రూ.22 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయడం మామూలు విషయం కాదు. మరి ఈ సినిమాతో సిద్ధు సర్ ప్రైజ్ హిట్ అందుకుంటాడో లేక ‘జాక్’లా మరో షాక్ తింటాడో చూడాలి.