
మానకొండూరు, డిసెంబర్ 16 (ఈవార్తలు): నిరూపించడంలో రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఆయా రాజకీయ పార్టీలు గెలిచిన సర్పంచ్ అభ్యర్థులను తమ పార్టీకి చెందినవారుగా ప్రకటించుకుంటున్నారు. ఇందులో భాగంగా గెలిచిన అభ్యర్థుల’కు సన్మానాలు కూడా ఉన్నాయి. అయితే కరీన్నగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కొత్తగా ఎంపికైన సర్పంచ్లకు శాల్వాలు కప్పి సన్మానం చేసింది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్య క్షులు జీవీ రామక్రుష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీగా ప్రచారం చేసుకొని ఇటీవల గెలుపొందిన మానకొండూర్ సర్పంచ్ తాళ్ళపల్లి వర్షిణిగౌడ్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో స్థానిక పార్టీ కార్యకర్తలు, ప్రజలు అవాక్కవుతున్నారు. మానకొండూర్ సర్పంచ్ బీఆర్ఎస్ కాదా? అని చెవులు కొరుక్కుంటున్నారు. అయితే సన్మానం పొందిన సర్పంచులలో ఏ పదవీ లేని వ్యక్తి ఉండటం గమనార్హం. ఏ పదవీ లేని వ్యక్తి సన్మానాలు పొందుతూ సంబురపడటం ఏమిటో..? సన్మానాల వరకు అయితే ఓకే కానీ, పాలనా వ్యవహారాల్లోనూ సర్పంచ్ను ఇంట్లో కూర్చోబెట్టి తనే అధిపత్యం చెలాయిస్తామంటే చూస్తూ ఊరుకోమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.