దేవీపట్నం మండలంలో ఆగని అక్రమ కలప రవాణా – నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్న అధికారులు.
అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకునేదెప్పుడు.
------------ సీపీఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ మట్ల.వాణిశ్రీ డిమాండ్
రంపచోడవరం : మార్చి /17
రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని దేవీపట్నం మండలంలో అటవీ సంపద యథేచ్ఛగా కొల్లగొట్టబడుతోంది. గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ, ప్రకృతి ప్రసాదించిన విలువైన కలపను అక్రమార్కులు తరలిస్తుంటే అధికారులు కన్నెత్తి చూడకపోవడం దారుణమని సిపిఎం రంపచోడవరం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ మట్ల.వాణిశ్రీ తీవ్రంగా ఖండించారు…
ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజన చట్టాలు, 1/70 చట్టం అమలులో ఉన్నప్పటికీ, వాటికి విరుద్ధంగా ఏజెన్సీ సంపదను అక్రమార్కులు దోచుకుంటున్నారనీ ఆమె అన్నారు.
అధికారుల మౌనం: రాత్రికి రాత్రి లారీలు, ట్రాక్టర్లతో, బొలెరో వ్యాన్లతో కలప తరలిపోతుంటే ఫారెస్ట్ చెక్ పోస్టులు ఏం చేస్తున్నట్లు? అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ దందా జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయనీ ఆమె ఆరోపించారు.. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల పేరుతోనూ, ఇతర సాకులతోనూ అడవిని గుండు కొట్టడం వల్ల భవిష్యత్తులో పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందనీ ఆమె అన్నారు..
"గిరిజనుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉన్న యంత్రాంగం, అక్రమార్కులకు కొమ్ముకాయడం సిగ్గుచేటనీ,గిరిజన సంపద గిరిజనులకే చెందాలి తప్ప, దళారీల పాలు కాకూడదనీ ఆమె అన్నారు.
దేవీపట్నం మండలంలో జరుగుతున్న అక్రమ రవాణాపై జిల్లా కలెక్టర్ మరియు ఉన్నత అటవీ అధికారులు తక్షణమే స్పందించి క్షేత్ర స్థాయి విచారణ చేపట్టాలనీ ఆమె డిమాండ్ చేశారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన స్థానిక అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలనీ,
అడవి లోపల నుండి కలప బయటకు వెళ్లే అన్ని మార్గాల్లో నిరంతర నిఘా సెంటర్లు ఏర్పాటు చేయాలనీ ఆమె డిమాండ్ చేశారు.
జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే, గిరిజన ప్రజలను ఏకం చేసి భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని, అవసరమైతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు ఆమె హేచ్చరిక చేశారు. అటవీ సంపద దోపిడీని ఉన్నతాదికారులు అరికట్టే వరకు దశలవారి పోరాటo చేస్తామని ఈ సందర్బంగా ఆమె తెలిపారు

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird