
ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-చంద్రశేఖర్ రావు
ఎండలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీని చిరుజల్లులు, అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పలకరిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ వరకూ పలు చోట్ల ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఎండ వేడి నుంచి కొంత ఉపశమనాన్ని కలిగించాయి. మరోవంక మెజారిటీ ప్రాంతాల్లో ఎండ తీవ్రత కనిపిస్తోంది.
వర్షాల ప్రభావం రెండు రోజుల పాటు కొనసాగనుంది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాలపై ఉన్న ప్రాంతం ఆవర్తనం మీద మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉండటమే దీనికి కారణం. వీటి ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదవుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.

వీటితో పాటు అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే బాపట్ల, పల్నాడు, మర్కాపురం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
ఆయా జిల్లాల్లో ఇదే పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగుతుంది. ఆకాశం మేఘావృతమై కనిపించవచ్చు. అక్కడక్కడ వర్షాలు పడొచ్చు. మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా కొర్లాంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 59.5 మిల్లీ మీటర్ల మే వర్షం కురిసింది. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలో 55.2, రాజంలో 47, కే కోటపాడులో 21.2 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది.