

- మృత్యువుతో పోరాడుతున్న రెండేళ్ల కేయాన్ష్
- ఆదుకోవాలని పిలుపునిచ్చిన బాలయ్య..
నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తనలోని సేవాగుణాన్ని చాటుకున్నారు. తన నియోజకవర్గానికి చెందిన ఓ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసి చలించిపోయారు. అత్యంత ఖరీదైన చికిత్స అవసరమైన బాలుడిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు రావాలని బాలయ్య భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు.
అసలేం జరిగిందంటే?
హిందూపురం నియోజకవర్గం లేపాక్షి గ్రామానికి చెందిన నటరాజు దంపతుల కుమారుడు కేయాన్ష్ అడ్విక్ (2.5 సంవత్సరాలు) ప్రస్తుతం ఒక భయంకరమైన ఆరోగ్య సమస్యతో పోరాడుతున్నాడు. వైద్యుల పరీక్షల్లో ఆ చిన్నారికి ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) టైప్ 2’ అనే అత్యంత అరుదైన, ప్రాణాపాయ వ్యాధి నిర్ధారణ అయింది. గత 21 నెలలుగా ఆ చిన్నారి బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది.
16 కోట్ల ఇంజెక్షన్ ఉంటేనే ప్రాణం నిలుస్తుంది..
ఈ వ్యాధి నుండి చిన్నారిని కాపాడాలంటే ‘AVXS-101’ (Onasemnogene Abeparvovec) అనే జీవరక్షక చికిత్స అవసరం. ఇది భారతదేశంలో అందుబాటులో లేదు, విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలి. ఈ ఒక్క ఇంజెక్షన్ ధర అక్షరాలా 16 కోట్ల రూపాయలు. సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన నటరాజు దంపతులు అంత భారీగా సమకూర్చుకోవడం అసాధ్యం. నిన్నటి హిందూపురం పర్యటనలో ఉన్న బాలకృష్ణను ఆ కుటుంబం కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
బాలయ్య అభయం – ప్రజలకు విన్నపం..
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బాలకృష్ణ, తన వంతుగా వ్యక్తిగత సహాయం చేస్తూనే, ప్రభుత్వపరంగా కూడా నిధుల సేకరణకు ప్రయత్నించానని హామీ ఇచ్చారు. “ఇంత భారీ మొత్తంలో ఆ కుటుంబం ఒక్కటే సమకూర్చుకోలేదు. కావున ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సాయం చేసి ఆ చిన్నారి భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరుతున్నాను” అని బాలయ్య ప్రకటించారు.
చిన్నారి ప్రాణాన్ని కాపాడేందుకు దాతలు నేరుగా తండ్రి ఖాతాకు నగదు బదిలీ చేయవచ్చు:
అకౌంట్ వివరాలు:
ఖాతా- 8265662545
పేరు – ఏఎస్ నటరాజ్
IFSC – IDIB000J028
శాఖ – JP నగర్
బాలకృష్ణ చేసిన ఈ విజ్ఞప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే కొన్ని దాతలు తమ వంతు సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఆ చిన్నారి తిరిగి ఆరోగ్యవంతుడై తల్లిదండ్రుల ఒడిలో క్షేమంగా ఉండాలని కోరుకుందాం.
https://www.facebook.com/share/p/1DxfDmwsxR/