
భారతదేశం
ఓయి-లింగారెడ్డి గజ్జల
భారతీయ సంగీత ప్రపంచంలో ఆశా భోంస్లే ఒక సంచలనం. ఆమె గొంతులో వైవిధ్యం ఎంత ఉందో, ఆమె ఆర్థిక ప్రస్థానంలో అంతటి పట్టుదల కనిపిస్తుంది. బాలీవుడ్ స్వర్ణయుగంలో ఒకవైపు లతా మంగేష్కర్ ఆధిపత్యం నడుస్తున్న కాలంలో.. ఆశా తనకంటూ ఒక ప్రత్యేక ఆర్థిక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
1950లు, 60ల కాలంలో పరిశ్రమలో వేతన వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండేది. లతా మంగేష్కర్ ఒక పాటకు రూ.500 తీసుకుంటే, ఆశా భోంస్లేకు అందులో 20 శాతం అంటే కేవలం రూ.100 నుంచి రూ.150 మాత్రమే చెల్లించేవారని సమాచారం. ప్రధాన గీతాలన్నీ అక్క లతకే దక్కేవి. కానీ, తనకు వచ్చిన చిన్న అవకాశాలను, ప్రయోగాత్మక గీతాలను, ఐటమ్ నంబర్లను ఆశ ఒక సవాల్గా తీసుకున్నారు. ఆ శ్రమనే నేడు ఆమెను దేశంలోని టాప్ 10 సంపన్న గాయనీమణుల జాబితాలో నిలబెట్టింది.

వ్యాపార సామ్రాజ్ఞిగా ‘ఆశాస్’ (ఆశాలు)
చాలామందికి తెలియని విషయం.. ఆశా భోంస్లే కేవలం పాటలతోనే కాదు, వ్యాపారవేత్తగా కూడా అంతర్జాతీయ స్థాయిలో సక్సెస్ అయ్యారు.
- గ్లోబల్ రెస్టారెంట్ చైన్: దుబాయ్, అబుదాబి, బహ్రెయిన్, కువైట్, యూకేలలో ‘ఆషా’ పేరుతో ఆమెకు లగ్జరీ రెస్టారెంట్ చైన్ ఉంది. అక్కడ దొరికే ప్రీమియం భారతీయ వంటకాలకు విదేశీయులు కూడా ఫిదా అయ్యారు.
- ఆస్తుల విలువ: 2026 నాటికి ఆశా భోంస్లే నికర ఆస్తుల విలువ సుమారు రూ.100 కోట్ల అంచనా. నేటితరం సింగర్స్ నేహా కక్కర్, శ్రేయా ఘోషల్లతో సమానంగా పోటీ పడుతూ ఈ జాబితాలో నిలిచిన ఏకైక పాతతరం దిగ్గజం ఆమె మాత్రమే.
ముంబై నడిబొడ్డున విలువైన ఆస్తి..
ఆశా భోంస్లే నివాసం ఉండే ముంబై పెద్దర్ రోడ్లోని ‘ప్రభు కుంజ్’ అపార్ట్మెంట్ అత్యంత విలువైన ఆస్తి. వీటితో పాటు ముంబై శివారు ప్రాంతాలు, పూణేలో కూడా భారీగా స్థిరాస్తులు కనిపిస్తున్నాయి.
ఆర్థిక విజయాలకు మించిన వారసత్వం..
కోట్ల రూపాయల ఆస్తులు, అంతర్జాతీయ రెస్టారెంట్లు కనిపిస్తాయి.. ఆశా భోంస్లే అసలైన సంపద ఆమె పాడిన 12 వేల పాటలే. 20కి పైగా భాషల్లో ఆమె పలికిన రాగాలు తరతరాలకు చెరగని వారసత్వం. ఒకప్పుడు వంద రూపాయల కోసం పాడిన గొంతు.. నేడు వంద కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించడమే కాకుండా, కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది.