
భారతీయ సినీ సంగీతంలో ఒక పెను సంచలనంలా వచ్చారు ఆశా భోస్లే. ఒక తరహా పాటలకే పరిమితం కాకుండా అన్ని రకాల పాటలతో సంగీత ప్రియులను అలరించారు. గాయనిగా దాదాపు 80 సంవత్సరాల కెరీర్ కొనసాగుతోంది ఆశా. తన తొమ్మిదో ఏటనే తొలి పాట పాడిన ఆశా 20 భాషల్లో 12,000కు పైగా పాటలు పాడి గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నారు.
తెలుగు పాటల విషయానికి వస్తే.. ఆశా భోస్లే సోదరి లతా మంగేష్కర్.. 1955లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘సంతానం’ చిత్రంలో ‘నిదురపోరా తమ్ముడా..’ పాటతో తెలుగు వారికి వీనుల విందు చేశారు. ఈ పాట చాలా పెద్ద హిట్ అయింది. చాలా సంవత్సరాల తర్వాత అక్కినేని నాగార్జున, శ్రీదేవి జంటగా నటించిన ‘ఆఖరిపోరాటం’ చిత్రంలో ‘తెల్ల చీరకు..’ అనే మరో మధురమైన పాటను ఆలపించారు. అలాగే హిందీ నుంచి డబ్ అయిన కొన్ని సినిమాల్లో కూడా పాటలు పాడారు.
ఇక ఆశాభోస్లే 1981లో విడుదలైన ‘పాలు నీళ్లు’ సినిమాలో తొలిసారిగా పాడారు. మోహన్బాబు, జయప్రద జంటగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ‘ఇది మౌనగీతం.. ఒక మూగ రాగం’ అనే పాట అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది. దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత కష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘చందమామ’ చిత్రంలో ‘నాలో ఊహలకు..’ అనే పాట పాడారు. ఇవి కాక తెలుగులో కొన్ని అన్నమయ సంకీర్తనలు కూడా పాడారు.