[ad_1]
భారతదేశం
ఓయ్-చంద్రశేఖర్ రావు
బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. బీజేపీ ఇప్పుడు బీహార్లో తన సొంత ముఖ్యమంత్రిని నియమించింది. బీహార్ రాజకీయ చరిత్రలో తొలిసారిగా బీజేపీకి చెందిన సారథి సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నారు. సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. కొద్దిసేపటి కిందటే బీజేఎల్పీ ఆయనను తమ నేతగా ఎన్నుకుంది. రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సామ్రాట్ చౌదరి రాజకీయ ప్రస్థానం 90వ దశకంలో మొదలైంది. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) నేపథ్యం నుంచో, బీజేపీ నుంచో రాజకీయ రంగ ప్రవేశం చేయలేదు. తన తండ్రి, దిగ్గజ రాజకీయ నాయకుడు శకుని చౌదరి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ నుండి సమతా పార్టీ, ఆ తరువాత ఆర్జేడీ వరకు వివిధ పార్టీలలో పనిచేసిన శకుని, బీహార్ రాజకీయాల్లో ఓబీసీ నేతగా పేరు తెచ్చుకున్నారు.

ఆయన తండ్రి శకుని చౌదరి సమతా పార్టీని వీడి లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీలో చేరడంతో, సామ్రాట్ చౌదరి రాజకీయ జీవితం మలుపు తిరిగింది. దీనికి ప్రతిఫలంగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి, ఆపై మంత్రి పదవి లభించింది. 1999లో రబ్రీ దేవి ప్రభుత్వంలో కేవలం 19 ఏళ్ల వయసుకే మంత్రి అయ్యి, రాష్ట్రంలో అత్యంత పిన్న వయస్కుడైన మంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. వయస్సు కారణంగా తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
అనంతరం సామ్రాట్ చౌదరి జనతాదళ్ (యునైటెడ్)లో చేరారు. 2014లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, జీతన్రామ్ మాంఝీకి పగ్గాలు అప్పగించినప్పుడు, సామ్రాట్ చౌదరికి మాంఝీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా చోటు లభించింది. నితీష్ కుమార్ తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయనకు మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. జేడీయూలో ఆశించిన రాజకీయ గుర్తింపు, ప్రత్యక్ష సామ్రాట్ చౌదరికి నితీష్ వ్యతిరేకత పెరిగింది. చివరికి ఆయన జేడీయూకు వీడ్కోలు చెప్పారు.
జేడీయూను వీడిన తర్వాత సామ్రాట్ చౌదరి 2018లో బీజేపీలో చేరారు. ఆయన వివిధ పార్టీలలో పనిచేసినప్పటికీ, నిజమైన రాజకీయ గుర్తింపు బీజేపీలోనే లభించాయి. ఎనిమిదేళ్ల వ్యవధిలో ఆయన పార్టీలో కీలక స్థానాలకు ఎదిగారు. 2019లో నిత్యానంద్ రాయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, సామ్రాట్ చౌదరిని రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన పంచాయితీ రాజ్ మంత్రిగానూ పనిచేశారు.
2020లో బీజేపీ తరపున విధాన పరిషత్కు ఎన్నికైన సామ్రాట్ చౌదరి, రాజకీయంగా మరింత బలపడ్డారు. ముఖ్యంగా 2022 ఆగస్టులో నితీష్ కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకొని ఆర్జేడీతో కలిసి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, సామ్రాట్కు మరింత గుర్తింపు వచ్చింది. అప్పుడు ఆయన విధాన పరిషత్లో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. 2023లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏ కూటమిలోకి వచ్చినప్పుడు, సామ్రాట్ చౌదరికి ఉపముఖ్యమంత్రి పదవి లభించింది.
బీజేపీ సామ్రాట్ చౌదరిని, ఆయన కోయిరి సామాజిక వర్గం బలాన్ని గుర్తించి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. బీజేపీలో ఆయన ఎదుగుదల అనూహ్యంగా ఉంది, పార్టీలోని సీనియర్ నాయకులను సైతం అధిగమించారు. నితీష్ కుమార్ కరడుగట్టిన వ్యతిరేకిగా సామ్రాట్ చౌదరిని పరిగణిస్తారు. నితీష్ తిరిగి ఎన్డీఏ కూటమిలోకి రావడం పట్ల ఆయన విభేదించారని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird