
vrmmedia
ప్రచురణార్థం
*ఎమ్మెల్సీ పోలింగ్ విధులను పకడ్బందీగా చేపట్టాలి ….. అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్
ఖమ్మం , ఫిబ్రవరి -26:
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ విధులను సిబ్బంది పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య ఆధారంగా అవసరమైన సామాగ్రిని పోలింగ్ సిబ్బందికి అప్పజెప్పాలని సూచించారు. పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతూ, ఒకటికి రెండు సార్లు పోలింగ్ సామగ్రి సరిచూసుకొని తీసుకొని వెళ్ళాలని, ఎన్నికల నియమ, నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ పోలింగ్ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని అన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం ఖమ్మం జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని, మొత్తం 4089 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు 9 సెక్టార్ అధికారులు, 28 ప్రిసైడింగ్ అధికారులు, 27 అసిస్టెంట్ ప్రొసీడింగ్ అధికారులు, 58 ఇతర పోలింగ్ సిబ్బంది , 28 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు, 8 రూట్లలో పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది, సామాగ్రిని తరలిస్తున్నామని, వీటి కోసం 8 ఆర్టీసీ బస్సులను సన్నద్ధం చేశామని అన్నారు.
ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు అవసరమైన చల్లని నీరు, క్యూలైన్ల వద్ద టెంట్, ఇతర సౌకర్యాలు కల్పించామని, జిల్లాలోనీ పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ఉపాధ్యాయ ఓటర్లందరూ తప్పనిసరిగా ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్ లో పాల్గొనేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చి, వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ పిలుపు నిచ్చారు. జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదవుతుందని అదనపు కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్నికలలో మనం వేసే ఓటు మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని, ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఆలోచించి, స్వేచ్చగా తమ ఓటు హక్కు వినియోగించు కోవాలని అదనపు కలెక్టర్ సూచించారు.
పోలింగ్ సామాగ్రితో ఎన్నికల విధుల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి తరలివెళ్లి, పోలింగ్ కేంద్రంలో గురువారం నాటి పోలింగ్ కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
సహాయ రిటర్నింగ్ అధికారిణి, జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షణ చేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో ఎన్. అరుణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు స్వామి, కలెక్టరేట్ ఎన్నికల డిటి అన్సారీ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

