Home వార్తలుఖమ్మం జర్నలిస్ట్ ల లక్ష్యంగా దాడిచేయడం దుర్మార్గచర్య

జర్నలిస్ట్ ల లక్ష్యంగా దాడిచేయడం దుర్మార్గచర్య

by VRM Media
0 comments

జర్నలిస్ట్ ల లక్ష్యంగా దాడిచేయడం దుర్మార్గచర్య
— ఏపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ కదం తొక్కిన జర్నలిస్ట్‌లు
-– సాక్షి ఎడిటర్‌ ధనుంజయ్‌రెడ్డి ఇంటిపై దాడిని ముక్తకంఠంతో ఖండించిన జర్నలిస్ట్‌ యూనియన్‌లు

ఖమ్మం, మే 9 : జర్నలిస్ట్ ల లక్ష్యంగా దాడిచేయడం దుర్మార్గచర్యని, సాక్షి ఎడిటర్‌ ధనుంజయ్‌రెడ్డి ఇంటిపై ఏపీ ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యానికి పాల్పడటాన్ని ఖండిస్తూ జర్నలిస్ట్‌ సంఘాలు ముక్తకంఠంతో నిరసనను వ్యక్తం చేశాయి. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో జర్నలిస్ట్‌లను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోందని విమర్శించారు. సాక్షి ఎడిటర్‌ ధనుంజయ్‌రెడ్డి ఇంటిపై ఏపీ పోలీసులు దాడిని ఖండిస్తూ శుక్రవారం జర్నలిస్ట్‌ సంఘాల ఆధ్వర్యంలో జెడ్పీకార్యాలయం నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. నల్ల బ్యాడ్జీల ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ నినాదాలు చేశారు. పత్రికా స్వేచ్ఛపై, జర్నలిస్ట్‌లపై ప్రభుత్వాల తీరును తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సంఘాల నేతలు ప్రసంగించారు.

జర్నలిజంపై ముప్పేటదాడి..
టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్‌) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన జర్నలిస్ట్‌ వ్యవస్థపై తెలుగు రాష్ట్రాల్లో దాడి జరుగుతోందన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వారికి అనుకూలంగా మాత్రమే వార్తలు రాయాలని పత్రికలు, విలేకరులు, ఎడిటర్ల పై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా విజయవాడలో సాక్షి ఎడిటర్‌ ధనుంజయ్‌రెడ్డి ఇంట్లోకి పోలీసులు అక్రమంగా జొరబడటం శోచనీయమన్నారు. ఎడిటర్‌కే రక్షణ లేనప్పుడు సామాన్య జర్నలిస్టు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జర్నలిస్ట్‌ వ్యవస్థకు సంకెళ్లు వేయాలని చూస్తున్న పాలక వర్గాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి దాడులను టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్‌) ఖండిస్తోందన్నారు.

మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారు..
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛను ప్రభుత్వాలు హరిస్తున్నాయన్నారు. ఇటీవలి కాలంలో జర్నలిస్ట్‌లపై దాడులు పెరిగాయని పేర్కొన్నారు. తమకు అనుకూలమైన వార్తలు ప్రచురించని పత్రికలు, ఛానల్స్‌పై రాజ్యాధికారాన్ని ఉపయోగించి దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఈ దాడులను యావత్తు జర్నలిస్ట్‌ సమాజం ఖండిస్తోందని తెలిపారు. సాక్షి ఎడిటర్‌ ధనుంజయ్‌రెడ్డి ఇంటిపై జరిగిన దాడికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో మీడియా వర్గాలపై దాడులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సాక్షి ఎడిటర్‌ ఇంటిపై దాడి హాస్యాస్పదం..
టీడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ .. మీడియా స్వేచ్చమీద, వ్యక్తిగత స్వేచ్ఛ మీద దాడులు కొనసాగుతున్నాయన్నారు. సాక్షి ఎడిటర్‌ ధనుంజయ్‌రెడ్డి ఇంటిపై కక్షపూరిత వైఖరితో, అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని దాడి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీనిని టీడబ్ల్యూజేఎఫ్‌ ఖండిస్తోందన్నారు. ధనుంజయ్‌రెడ్డి ఏమైనా నేరాలు చేశారా.. అటువంటివి ఏమీ లేకుండా కేవలం జర్నలిస్ట్‌లను బెదిరించాలి.. వారిని అనుకూలంగా మలచుకోవాలనే వైఖరితో భయభ్రాంతులకు గరి చేయడం కోసం ఇటువంటి చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. అక్కడ ఉన్న జర్నలిస్ట్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. వాస్తవాలు రాసిన జర్నలిస్ట్‌లపై ఇటువంటి చర్యలకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్‌) జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, బాధ్యులు గుద్దేటి రమేష్, కొరకొప్పుల రాంబాబు, యలమందల జగదీష్, టీఎస్‌ చక్రవర్తి, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నగర అధ్యక్షుడు మైసా పాపారావు, కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్, బాధ్యులు మోహిద్దీన్, శివానంద, టీడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా నాయకులు సయ్యద్‌ ఖదీర్, దువ్వా సాగర్, ఆవుల శ్రీనివాస్, కూరాకుల గోపి, వేగినాటి మాధవరావు, మహిళ ప్రతినిధులు వంగూరి ఈశ్వరి,మధుశ్రీ, సాక్షి ఎడిషన్‌ ఇంచార్జి కేశవ్, బ్రాంచిమేనేజర్‌ మోహన్‌క్రిష్ణ, సాక్షిటీవీ స్టాఫర్‌ పి.మహేందర్‌కుమార్, సాక్షి ఏసీఎం శ్రీనివాస్, సీనియర్‌ జర్నలిస్ట్‌ మారెడ్డి నాగేందర్‌రెడ్డి, సాక్షి సిబ్బంది పాల్గొన్నారు. ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శులు ఇటికాల రామకృష్ణ, వంగూరి వెంకటేష్‌లు ఈ నిరసనకు సంఘీభావం తెలిపారు.

2,848 Views

You may also like

Leave a Comment