ది.22.06.2025
టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఖమ్మం.
Vrm media ప్రతినిధి ఖమ్మం


మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్ధేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనదని ఖమ్మం టూ టౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ అన్నారు.
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అవగాహన కార్యక్రమాల నిర్వహణలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని రేవతి సెంటర్ చెందిన యువత కు అవగాహన కార్యక్రమం స్ధానిక కవిత డిగ్రీ కాలేజ్ లో ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ సరదా కోసం మొదలైన అలవాటు.. మత్తులోకి నెడుతోందని, గతంలో సిగరెట్, మద్యంతో సరిపెట్టుకునే యువత.. ఇప్పుడు నిషా కోసం గంజాయి, మాదకద్రవ్యాల బారినపడి మత్తుకు బానిసలవుతున్నారని అన్నారు. సమాజంలోని మాదకద్రవ్యాల ముప్పును అంతం చేసే లక్ష్యంతో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఇప్పటికే పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నిర్మూలన కోసం నషాముక్త్ భారత్ అభియాన్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. మాదక ద్రవ్యాలకు ప్రభావితమైన వారిని ఆ మహమ్మారి వ్యవసనాల నుండి బయట పడేసేందుకు డి ఎడిక్షన్ కేంద్రాలు కూడా నిర్వహించబడుతున్నాయన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు నేటి యువత బానిసలై తమ ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. యువత మాధకద్రవ్యాల బారిన పడకుండా ఉండేలా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల వినియోగం కారణంగా కలిగే దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాల బానిసలై విముక్తిపొందిన వారితో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను గురించి తెలియజేసినట్లైతే , యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా రక్షించవచ్చన్నారు.