VRM మీడియా న్యూస్
సత్తుపల్లి ప్రతినిధి
ఖమ్మం జిల్లా
3-04-2026
ఖమ్మం జిల్లాకు చెందిన డిజిటల్ మీడియా మహిళా జర్నలిస్టు పాపినేని అనంత లక్ష్మి మానవతా విలువలను నిలబెట్టారు. భర్త మరణంతో తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ, ఆయన అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చి, మరికొందరికి ప్రాణదాతగా నిలిచారు.
వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కలకొడిమ గ్రామానికి చెందిన పాపినేని నాగేశ్వరరావు ప్రస్తుతం ఖమ్మంలో నివాసం ఉంటున్నారు. ఆయన ఒక మొక్కజొన్న విత్తన సంస్థలో ప్రతినిధిగా పనిచేస్తుండగా, ఆయన భార్య అనంత లక్ష్మి డిజిటల్ మీడియా వెబ్ ఇన్చార్జ్, సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు.
ఇటీవల విధి నిర్వహణలో భాగంగా నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని కామినేని ఆసుపత్రికి తరలించగా, ఐదు రోజుల పాటు వైద్యం అందించినప్పటికీ ఆయన ప్రాణాలు నిలువలేకపోయాయి.
వైద్యుల సూచన మేరకు, తన భర్త అవయవాలను దానం చేయాలని అనంత లక్ష్మి తీసుకున్న నిర్ణయం ఆమె మానవతా దృక్పథానికి నిదర్శనంగా నిలిచింది. ఈ అవయవ దానం ద్వారా పలువురికి కొత్త జీవితం లభించనుంది.
నాగేశ్వరరావుకు భార్య అనంత లక్ష్మితో పాటు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.
