
భారతదేశం
-లింగారెడ్డి గజ్జల
నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా చురుగ్గా కదులుతున్నాయి. శనివారం నాటికి మరింత వేగవంతమైన రుతుపవనాలు.. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు విజయవంతంగా విస్తరించాయి. భారత వాతావరణ శాఖ (IMD) నివేదిక.. ఇప్పటికే గోవా మొత్తం, తమిళనాడులోని మెజారిటీ ప్రాంతాల్లో ఇవి కప్పివేశాయి. అరేబియా సముద్రంలోని పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య ప్రాంతాలు, కర్ణాటక సహా బంగాళాఖాతంలో మెజారిటీ భాగం రుతుపవనాల ఆధీనంలోకి వచ్చింది. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మణిపూర్లలోకి కూడా ఇవి ప్రవేశించడంతో రుతుపవనాలు ఉత్తర దిశగా స్థిరంగా, ఆశాజనకంగా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.
రెండు రోజుల్లో తెలంగాణకు విస్తరణ..
రాబోయే రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన ప్రాంతాలతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలోని మరిన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ పూర్తి చేసింది. ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతంలోని ఇతర రాష్ట్రాలకు కూడా రుతుపవనాలు చేరుకోనున్నాయి. గడిచిన 48 గంటల్లో కేరళ, కర్ణాటక తీరప్రాంతం, మేఘాలయ, ఒడిశా, బీహార్, అండమాన్ నికోబార్ దీవులలో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి.

ఈశాన్యంలో జలప్రళయం.. ఐఎండీ హెచ్చరికలు
వచ్చే వారం రోజుల్లో దక్షిణ రాష్ట్రాలతో పాటు ఈశాన్య భారతంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర తీర ప్రాంతం, అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలలో వరద ముప్పు పొంచి ఉంది. ఇక ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలలో జూన్ 12 వరకు విస్తృతంగా కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. తీవ్ర వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, నగరాల్లో ట్రాఫిక్ అంతరాయాలు, కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
ఉత్తరాదిని వణికిస్తున్న ఎండలు.. ఢిల్లీలో రెడ్ అలర్ట్!
దక్షిణ, తూర్పు ప్రాంతాలు వర్షాలతో చల్లబడుతుంటే.. వాయువ్య, మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా నిప్పుల గుండంలా మండుతూనే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, రాజస్థాన్ ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే వారం రోజుల్లో తీవ్రమైన వేడిగాలులు (హీట్ వేవ్స్) వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. రుతుపవనాల రాక ఆలస్యమయ్యే ఉత్తరాది రాష్ట్ర ప్రజలు ఎండల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్న సమయాల్లో బయటకు రావద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.