
భారతదేశం
ఓయ్-చంద్రశేఖర్ రావు
మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నేడు పట్టాలెక్కబోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం వీటిని జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇందులో వివిధ రాష్ట్రాలు, నగరాల మధ్య పరుగులు తీస్తున్న అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సంఖ్య 66కు చేరుకుంటుంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లకు ధీటుగా, దానితో పోల్చుకుంటే తక్కువ ఛార్జీలతో ఇవి అందుబాటులోకి వస్తుండటంతో అమృత్ భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
నేడు పట్టాలెక్కనున్న అమృత్ భారత్ రైళ్లు.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కీలక ప్రాంతాలను కలుపుతాయి. వారణాసి (బనారస్)- పుణెలోని హడప్, అయోధ్య- ముంబైలను కనెక్ట్ చేసే రైళ్లు ఇవి. బనారస్- పుణే ఎక్స్ ప్రెస్ ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది. అయోధ్య- ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ మధ్య రాకపోకలు సాగించేది వీకెండ్ ఎక్స్ ప్రెస్. వారంలో ఒకరోజు మాత్రమే రాకపోకలు సాగుతుంది.

అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పూర్తిగా నాన్-ఏసీ సర్వీసులు. వీటిలో జనరల్, స్లీపర్ క్లాస్ కోచ్లు ఉంటాయి. వందే భారత్ రైళ్లకు ధీటుగా ఆధునిక సీటింగ్, కుడుపు లేని సెమీ ఆటోమెటిక్ కప్లర్లు, మెరుగైన భద్రతా వ్యవస్థ, సీసీటీవీ, అత్యవసర సమాచార సౌకర్యాలు, అగ్నిమాపక పరికరాలతో కూడుకుని ఉంటుంది. మెరుగైన లైటింగ్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్లు, ఆధునీకరించిన టాయిలెట్లు, దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు కూడా ఈ రైళ్లలో అందుబాటులో ఉంటాయి.
బనారస్-హడప్సర్ (పుణే) ఎక్స్ ప్రెస్.. ప్రయాగ్రాజ్, ఝాన్సీ, భోపాల్, ఇటార్సీ, జలగావ్, మన్మాడ్ వంటి కీలక నగరాల గుండా రాకపోకలు సాగుతాయి. ఈ రెండు స్టేషన్ల మధ్య మొత్తం 18 స్టేజీలు ఉన్నాయి. గమ్యస్థానానికి చేరుకోవడానికి 30 గంటలు పడుతుంది. అయోధ్య-ముంబై రైలు సుమారు 28 గంటల్లో 12 స్టాప్లతో తన గమ్యాన్ని చేరుకుంటుంది. దీనికి సుల్తాన్పూర్, ప్రతాప్గఢ్, జబల్పూర్, భుసావల్, నాసిక్ స్టేషన్లలో హాల్ట్ సౌకర్యం ఉంది. మూడు రాష్ట్రాలను ఈ రెండు రైళ్లు కూడా కవర్ చేస్తుంది. రెండు రైళ్లు పుష్-పుల్ టెక్నాలజీతో నడుస్తాయి.