
భారతదేశం
ఓయ్-సయ్యద్ అహ్మద్
ఎడారి రాష్ట్రం రాజస్థాన్ లో ఇవాళ ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని బికనీర్ పట్టణాన్ని ఓ భారీ ఇసుక తుఫాన్ (రాజస్థాన్ డస్ట్ స్టార్మ్ ) కమ్మేసింది. మధ్యాహ్నం హఠాత్తుగా ధూళి మేఘాలు ఆకాశాన్ని కమ్మేశాయి. దీంతో బికనీర్ కాస్తా పగలే రాత్రిలా మారిపోయింది. పసుపు ధూళితో కూడిన ఒక భారీ గోడ నగరం వైపు దూసుకువస్తునట్లుగా కనిపిస్తున్న వీడియోలు (వైరల్ వీడియో) సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏదో ప్రళయం కమ్ముకు వస్తున్నట్లుగా ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఈ ఇసుక తుఫాన్ కారణంగా ప్రధాన రోడ్లపై దారి కనిపించకుండా పోయింది. నగరాన్ని దట్టమైన పొగమంచుతో కప్పేయడంతో పాటు వింతైన పసుపు-గోధుమ రంగు కాంతి కూడా కనిపించింది. దీంతో వాహనాలను నడపడం కూడా ప్రమాదకరంగా మారింది. చాలా మంది ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ధూళితో కూడిన గాలులు తీవ్రమవడంతో అనేక ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. షాపుల ఓనర్లు హడావిడిగా షట్టర్లు దించేశారు. పాదచారులు తుఫాను నుండి రక్షించుకోవడానికి పరుగులు తీయడంతో మార్కెట్లలో గందరగోళం ఏర్పడింది.

రాజస్థాన్లోని బికనీర్లో దుమ్ము రేపింది. pic.twitter.com/J9j1I1rLBy
— ముఫద్దల్ వోహ్రా (@mufaddal_vohra) మే 30, 2026
ఈ గాలుల తీవ్రత బికనీర్లో సాధారణ కార్యకలాపాలకు సైతం అంతరాయం కలిగించింది. బలమైన గాలుల కారణంగా చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రజలకు సూచించింది. గత 24 గంటల్లో రాజస్థాన్లోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కూడా పడ్డాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే నాలుగైదు రోజుల పాటు మధ్యాహ్నం పూట ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.