
ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-చంద్రశేఖర్ రావు
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఉంటే శ్రీవారి ధర్మ రథాలకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఇటీవలే డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుతో మరింత ప్రజాదరణ పొందుతోంది. వచ్చే సమయాన్ని భక్తులు ముందుగానే తెలుసుకునేలా వీటిని ఏర్పాటు చేయడం వల్ల బస్సులు వేచిచూసే సమయం తగ్గింది. దీంతో ఉచిత రవాణా సేవలను భక్తులు విస్తృతంగా వినియోగిస్తున్నారు. వీటి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.
ప్రస్తుతం తిరుమలలో మొత్తం 12 ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే నయాతి హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ ఆగ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మరో బస్సును టీటీడీకి విరాళంగా అందజేసింది. వీటి సంఖ్య 13కు పెరిగింది. రోజుకు సగటున 300 ట్రిప్పులు నడుస్తున్నాయి. ఈ విధానం దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల్లో భక్తుల కోసం రియల్ టైమ్ బాస్ సమాచారం అందించే మొదటి సాంకేతిక ప్రయోగంగా నిలుస్తోంది.

రోజుకు 60 వేల మంది భక్తులు సురక్షితంగా ప్రయాణం
రియల్ టైం, డిస్ ప్లే మేనేజ్మెంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజుకు సుమారు 60,000 మంది భక్తులు ఈ ఉచిత బస్సు సేవలను వినియోగిస్తున్నారు. గతంలో ఉచిత బస్సు వచ్చే సమయం ముందుగా తెలియన భక్తులు ప్రైవేట్ ట్యాక్సీల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపేవారు. ఈ సమస్యను గుర్తించిన టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి చొరవతో డిజిటల్ డిస్ ప్లే బోర్డులు ఏర్పాటయ్యాయి.
దీనికోసం హైదరాబాద్ కు చెందిన బీఎస్ టెక్నోట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డిజిటల్ బోర్డులను విరాళంగా అందించింది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది. ఈ విధానం అమలు నుండి బస్టాప్ వద్దకు వచ్చిన భక్తులకు బస్సు వచ్చే సమయం ప్రత్యక్షంగా తెలియడం, 10 నిమిషాల లోపే బస్సులు రావడంతో భక్తులు ఉచిత బస్సు సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారు.
ఇంధన వినియోగం తగ్గడం..
ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం ద్వారా ఇంధన వినియోగం తగ్గడంతో పాటు కాలుష్య నియంత్రణకు కూడా ఈ సౌకర్యం దోహదపడుతోంది. అదేవిధంగా తిరుమలలో వాహన రద్దీని తగ్గించి కాలుష్య నియంత్రణ దిశగా పటిష్టమైన ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడానికి, భక్తులకు అనువైన, పర్యావరణ హితమైన రవాణాను అందించాలనే లక్ష్యంతో టీటీడీ ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోంది.
భక్తుల కోసం రాత్రుల్లో..
ప్రస్తుతం రాత్రి 9 నుండి తెల్లవారు జామున 5 గంటల వరకు ఈ ఎలక్ట్రిక్ బస్సులు 60 ట్రిప్పులు తిరుగుతుండగా భక్తుల సౌకర్యార్థం అదనంగా మరో 20 ట్రిప్పులను పెంచుతారు. అదే విధంగా రాబోయే రోజుల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.