
ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-కొరివి జయకుమార్
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. కేవలం రూ.5కే రుచికరమైన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందించే అన్న క్యాంటీన్లను విస్తరించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని క్యాంటీన్లను ఏర్పాటు చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ఈ నెల 15న పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం లోని ధరణికోటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. అంతే కాకుండా ప్రజలతో కలిసి సీఎం భోజనం కూడా చేయనున్నారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పుర, నగరపాలక సంస్థల్లో ప్రస్తుతం 207 క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా 62 క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. కొత్తగా అందుబాటులోకి రానున్న వాటితో కలిపి వీటి సంఖ్య 269కి పెరగనుంది అధికారులు. భవిష్యత్తులో దశలవారీగా మరిన్ని క్యాంటీన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈసారి అన్న క్యాంటీన్ల విస్తరణ గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించింది.

ఇప్పటివరకు నగరాలు, పట్టణాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మాత్రమే ఉన్న క్యాంటీన్లు ఇప్పుడు మండల కేంద్రాలు, గ్రామాలకు కూడా అందుబాటులోకి వస్తాయి. తక్కువ ధరకే పౌష్టికాహారం అందించడమే ఈ విస్తరణ ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. గతంలో అన్న క్యాంటీన్ల ద్వారా 8.80 కోట్ల మంది లబ్ధి పొందగా.. గ్రామీణ ప్రాంతాల విస్తరణతో ఈ సంఖ్య పెరుగుతుందని అంచనా.
ఒక్కో క్యాంటీన్లో సుమారు వెయ్యి మంది భోజనం చేయగా.. రోజుకు రూ.26,000 వరకు ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. 207 క్యాంటీన్ల ద్వారా రోజూ 2.10 లక్షల మంది భోజనాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. ఇందుకు రోజుకు రూ.54 లక్షల వ్యయం అవుతోంది.. సబ్సిడీ కింద ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.243 కోట్లు ఖర్చు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసే క్యాంటీన్లపై సబ్సిడీ కింద ఏడాదికి మరో రూ.58 కోట్ల వ్యయం కానుందని వెల్లడిస్తున్నారు.
అల్పాహారంగా ఇడ్లీ, పూరీ, ఉప్మా, పొంగల్లో ఉంటాయి. భోజనం, రాత్రి భోజనానికి పెరుగు అన్నం, పప్పు, సాంబార్, పచ్చడితో పాటు ఒక కూర అందిస్తారు. ఈ క్యాంటీన్లు సోమవారం నుంచి శనివారం వరకు తెరచి ఉంటాయి, ఆదివారం మాత్రం మూసివేస్తారు.