
తెలంగాణ
ఓయ్-జక్కీ మహేష్
జగిత్యాల రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. జగిత్యాల జనగర్జన పేరుతో జరిగిన సభా వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో కేసీఆర్ స్వయంగా జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా.. ఆయనకు అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగిస్తూ అక్కడికక్కడే సంచలన నిర్ణయం తీసుకున్నారు.
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకం
సభలో ప్రసంగించిన కేసీఆర్.. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. కేవలం జగిత్యాల జిల్లాకే పరిమితం కాకుండా.. పాత కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేశారు. “జీవన్ రెడ్డి పార్టీలో చేరారంటేనే రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఊపు వస్తుంది. ఆయన రాకతో బీఆర్ఎస్కు కొత్త శక్తి వచ్చింది” అని కేసీఆర్ కొనియాడారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని, అప్పుడు జీవన్ రెడ్డికి మరిన్ని కీలక పదవులు దక్కిన కేసీఆర్ భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరారని.. జీవన్రెడ్డి గుండె ధైర్యం.. జీవన్రెడ్డి తన ప్రాంతం కోసం ప్రాణం పెట్టి పనిచేశారన్నారు.

45 ఏళ్ల స్నేహం.. ప్రజా హితమే లక్ష్యం
జీవన్ రెడ్డితో తనకున్న 45 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. “మేమిద్దరం ప్రాణ స్నేహితులం. రాజకీయ సిద్ధాంతాలు వేరైనా, వ్యక్తిగతంగా ఎప్పుడూ సుఖదుఃఖాలను పంచుకునేవాళ్లం. జీవన్ రెడ్డికి ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ ఎందరికో ఆదర్శం” అని ప్రశంసించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్షంలో ఉండి కూడా జీవన్ రెడ్డి జగిత్యాల అభివృద్ధి కోసం బోర్నపల్లి బ్రిడ్జిని అడిగిన తీరును కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అనేక జిల్లాలపై జీవన్ రెడ్డి ప్రభావం
జీవన్ రెడ్డి చేరికపై జరిగిన సర్వేల వివరాలను కేసీఆర్ పరిశీలించారు. కేవలం జగిత్యాల మాత్రమే కాకుండా చొప్పదండి, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి వంటి అనేక నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం స్పష్టంగా ఉందని సర్వేల్లో తేలిందని చెప్పారు. నిఖార్సైన ప్రజా కార్యకర్తగా, సమితి అధ్యక్ష స్థాయి నుంచి మంత్రి వరకు ఎదిగిన ఆయన అనుభవం పార్టీకి కొండంత అండగా ఉంటారని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఆనాటి రోజులను గుర్తు చేసుకున్న కేసీఆర్
గతంలో తెలంగాణ అనే పదం పలకడానికే భయపడే రోజులు.. తెలంగాణ పదాన్నే నిషేధించే పరిస్థితులు.. మన నీళ్లు, వనరులను వినియోగించుకున్నారు.. పాలమూరు జిల్లాలో 90 శాతం వలసలే.. కొన్ని పార్టీల తీరుతో ఆవేశం, బాధ, బాధ.. మూలిగే నక్కపై తాటిపండులా చంద్రబాబు కరెంట్ ఛార్జీలు పెంచారు.. బషీ జెండా పట్టుకుని ఉద్యమానికి వచ్చానని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని కొట్లాడితే ఓ ప్రకటన చేసింది.
కాంగ్రెస్ వైఫల్యాలపై ధ్వజం
జీవన్ రెడ్డి పార్టీ మారడానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన కారణమని సభలో చర్చ జరిగింది. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని జీవన్ రెడ్డి విమర్శించగా, దానికి కేసీఆర్ మద్దతు పలికారు. ప్రజల కోసం నిరంతరం తపించే జీవన్ రెడ్డి వంటి నాయకుడిని కాంగ్రెస్ అవమానించడం వల్లే ఆయన మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా అవతరించిందని రాజకీయ విశ్లేషకులు.