
వ్యాపారం
-కొరివి జయకుమార్
క్రెడిట్ కార్డుల వాడకం ఇటీవల బాగా పెరిగింది. రూపే కార్డులను యూపీఐతో అనుసంధానించే అవకాశం రావడంతో, చిన్న మొత్తాల చెల్లింపులకు కూడా వీటిని విస్తృతంగా వాడుతున్నారు. ఈ కార్డులు లావాదేవీలను సులభతరం చేస్తున్నప్పటికీ, కొన్ని ప్రత్యేక సందర్భాలలో వాటిని ఉపయోగించడం ఆర్థికంగా శ్రేయస్కరం. అటువంటి పరిస్థితులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
క్రెడిట్ కార్డుల ద్వారా ఏటీఎం నుండి నగదు విత్ డ్రాలు అత్యవసరాల్లో మాత్రమే చేయాలి. కార్డు పరిమితిలో 20 శాతం నగదు డ్రా చేసుకోవచ్చు. కానీ, చేసిన రోజు నుంచే నెలకు 2.85% అధిక వడ్డీ వసూలు చేస్తారు. అదనంగా 2.50% నుండి 3% వరకు ఫ్లాట్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు ఉంటాయి. ఈ అధిక భారాల దృష్ట్యా ఈ సేవను నివారించడమే ఉత్తమం.

కిరాణా, ఆహారం లేదా ఇతర గృహ అవసరాల వంటి చిన్న మొత్తాల కొనుగోళ్లకు క్రెడిట్ కార్డు వాడకం సరికాదు. దీనివల్ల అనవసరమైన ఖర్చులు పెరిగి, మీ బడ్జెట్పై భారం పడుతుంది. బిల్లు చెల్లించడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఈ సందర్భాలలో నగదు లేదా డెబిట్ కార్డు వాడడమే తెలివైన నిర్ణయం.
విదేశీ ప్రయాణాలలో క్రెడిట్ కార్డులను ఉపయోగించడం అదనపు ఖర్చులకు. విదేశీ కరెన్సీ మార్పిడి, క్యాష్ అడ్వాన్స్, విదేశీ లావాదేవీల ఛార్జీలు కలిపి దాదాపు 3 శాతం వరకు అదనపు భారం పడుతుంది. ఈ అధిక ఛార్జీల నుండి తప్పించుకోవడానికి, ప్రీపెయిడ్ కరెన్సీ కార్డులను వాడటం సరైన పరిష్కారం.
సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించకపోతే, కార్డును వాడకపోవడమే మంచిది. ఆలస్య చెల్లింపులకు ₹250 నుంచి ₹600 వరకు జరిమానా, బకాయి మొత్తం లావాదేవీ జరిగిన తేదీ నుంచే 2.5% నుండి 3% వరకు వడ్డీ విధిస్తారు. కనీస బ్యాలెన్స్ చెల్లించినా, మిగిలిన బ్యాలెన్స్పై 5% వడ్డీ పడుతుంది. ఇది తీవ్రమైన ఆర్థిక భారానికి, అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది.