VRM మీడియా న్యూస్
సత్తుపల్లి ప్రతినిధి
ఖమ్మం జిల్లా
తేది: 08-05-2026
సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో నిర్వహించగా, తుమ్మల యుగంధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ.. తుమ్మల నాగేశ్వరరావు గారు నాలుగు దశాబ్దాలుగా ప్రజా సేవలో కొనసాగుతూ అభివృద్ధికి కృషి చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. ముఖ్యంగా సాగునీటి రంగంలో ఆయన చేసిన సేవలు ఖమ్మం జిల్లా చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు.
డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ.. తుమ్మల గారు అభివృద్ధి ప్రదాతగా, అజాతశత్రువుగా ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు.
అనంతరం తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ.. తన తండ్రిపై సత్తుపల్లి ప్రజలు చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు, తుమ్మల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


