VRM మీడియా అయినవిల్లి భద్రం
_గోకవరం మండలం,
గోకవరం మండలం గోపాలపురం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రోడ్డు మరమ్మతులకు నోచుకోకపోవడంతో గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డంతా బురదమయమై చెరువును తలపిస్తోంది.
దీంతో రాకపోకలు స్తంభించాయి. ద్విచక్ర వాహనదారులు ప్రతిరోజూ జారిపడి గాయాలపాలవుతున్నారు. ఆటోలు, కార్లు బురదలో కూరుకుపోతున్నాయి. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు బురదలో పడుతూ నడుస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలించలేక రైతులు నష్టపోతున్నారు. అత్యవసర సమయంలో గర్భిణులు, వృద్ధులు ఆస్పత్రికి వెళ్లడం కూడా దుస్సాధ్యంగా మారింది.
గ్రామస్తులు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి రోడ్డుకు శాశ్వత పరిష్కారంగా కొత్త బీటీ రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే రోడ్డుపై ధర్నా చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
