బోనకల్, ఏప్రిల్ 26:
శ్రీ వాసవి మాత జయంతి సందర్భంగా బోనకల్ మండల కేంద్రంలో వైభవంగా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో బోనకల్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం రోడ్డులోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో గోపూజ, జయంతి ఉత్సవాలు, ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఆర్యవైశ్య సంఘం సభ్యులు పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించి, రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం బోనకల్ పంచాయతీ కార్యాలయం వద్ద కూడలి (రింగ్) ఏర్పాటు చేసి అందులో మహాత్మా గాంధీ, ఛత్రపతి శివాజీ విగ్రహాలు ప్రతిష్టించాలంటూ సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ ప్రతిపాదనపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి కూడలి ఏర్పాటు చేసి విగ్రహాలు ప్రతిష్టించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చెడే వెంకటేశ్వరరావు, మధిర మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనుమోలు వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పైడిపల్లి కిషోర్ బాబు, పాసంగులపాటి కోటేశ్వరరావు, రావినూతల సర్పంచ్ బద్రు నాయక్, ముష్టికుంట్ల సర్పంచ్ పిల్లలమర్రి నాగేశ్వరరావు, చావా వెంకటేశ్వరరావు, సాయిబాబా టెంపుల్ చైర్మన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

