ఖమ్మం, ఏప్రిల్ 26: నగరానికి చెందిన ప్రముఖ గజల్ కవి, సీనియర్ జర్నలిస్ట్ కట్టెకోల చిన నరసయ్యను విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ ఘనంగా సత్కరించింది. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ 5వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్, బిక్కీ కృష్ణల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వార్షికోత్సవంలో పలువురు ప్రముఖు గజల్ రచయితల పుస్తకాలను ఆవిష్కరించారు. గజల్ రచనలలో గానంలో ఆరితేరిన ప్రముఖ గజల్ గాయనీ గాయకులను, గజల్ రచనలలో ప్రతిభ కనపరిచిన గజల్ కవులను, కవయిత్రులను జాతీయ అవార్డులతో ఫౌండేషన్ సత్కరించింది. అందులో భాగంగా గజల్ కవి కట్టెకోల చిన నరసయ్యకు ఎన్టీఆర్ సాహిత్య కమిటీ చైర్మన్ టిడి జనార్ధన్, విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్, బిక్కీ కృష్ణ, ప్రముఖ కవయిత్రి, కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షురాలు డాక్టర్ రాధాకుసుమలు శాలువా కప్పి, ప్రశంసా పత్రాన్ని మెమెంటోలను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు కట్టెకోలను అభినందించారు.
