VRM మీడియా అయినవిల్లి భద్రం
భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రపంచస్థాయి వసతులు కల్పించాలి: డిప్యూటీ సీఎం ఆదేశం
పాల్గొన్న రాజనగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ ..
2027 వ సంవత్సరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోయే ‘అఖండ గోదావరి పుష్కరాల’ ముందస్తు ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పర్యటనలో భాగంగా ఆయన పుష్కర ఘాట్లను, మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదించిన పలు ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సమీక్షా మరియు పరిశీలనా కార్యక్రమంలో రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ , తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి , స్థానిక శాసనసభ్యులు, కూటమి ముఖ్య నాయకులు మరియు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కోట్ల సంఖ్యలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఘాట్ల నిర్మాణం, రవాణా సౌకర్యాలు, తాగునీరు, పారిశుధ్యం మరియు భద్రతా పరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాట్లుండాలని అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. పుష్కరాల నిధుల వినియోగం, శాశ్వత అభివృద్ధి పనుల ప్రణాళికలను కలెక్టర్ కీర్తి చేకూరి ని అడిగి తెలుసుకున్నారు.
రాజనగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. ఉమ్మడి గోదావరి జిల్లాల ఘనకీర్తిని చాటేలా ఈ పుష్కరాలను నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్థానిక నియోజకవర్గాల పరిధిలో భక్తుల రాకపోకలకు వీలుగా రోడ్ల విస్తరణ, సుందరీకరణ పనులపై ఉపముఖ్యమంత్రి కి ప్రత్యేకంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పుష్కరాల విజయవంతానికి సమన్వయంతో పనిచేస్తామని స్పష్టం చేశారు.
